Search for:

రారాజు గుకేశ్‌..

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ 2024 టైటిల్‌ కైవసం

- అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
- ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌కు అర్హత

టొరంటో : భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ సంచలన ప్రదర్శనతో ప్రతిష్టాత్మక ‘క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ 2024’ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్‌ విజేతను నిర్ణయించే 14వ రౌండ్‌లో హికారు నకముర (అమెరికా)తో గేమ్‌ను డ్రా చేసుకున్న అతడు 9 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానానికి చేరి 17 ఏండ్ల వయసులోనే ఈ టోర్నీ నెగ్గిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టోర్నీ ఆద్యంతం అంచనాలకు మించి రాణించిన గుకేశ్‌.. తుది రౌండ్‌లో నల్లపావులతో బరిలోకి దిగాడు. 71 ఎత్తులలో ముగిసిన ఈ గేమ్‌ తర్వాత టోర్నీ విజేతను నిర్ణయించే క్రమంలో కొంత నాటకీయత చోటుచేసుకుంది. 14వ రౌండ్‌లో ఫాబియానో కరువానా (అమెరికా) – ఇయాన్‌ నెపొనియాచి (రష్యా) ల మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచినా వారి పాయింట్లూ గుకేశ్‌తో సమానంగా (9) ఉండేవి. అప్పుడు విజేతను సంయుక్తంగా ప్రకటించాల్సి వచ్చేది. కానీ 41వ ఎత్తులో కరువానా తప్పిదం నెపొనియాచికి కలిసొచ్చి అతడు గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో నెపొనియాచి, కరువానా, నకముర 8.5 పాయింట్ల వద్దే ఆగిపోయి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. 8 మంది ఆటగాళ్లు ‘డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌’లో తలపడ్డ ఈ టోర్నీలో గుకేశ్‌.. ఏడో రౌండ్‌లో మాత్రమే ఓడిపోయాడు. కానీ ఆ రౌండ్‌లో ఓటమే తనలో కసి పెంచిందని విజేతగా నిలిచిన తర్వాత అతడు వెల్లడించాడు.
ప్రపంచ చాంపియన్‌తో ‘ఢీ’

ఈ విజయంతో గుకేశ్‌.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతడు చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌తో తలపడాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కానప్పటికీ ఇక్కడా గెలిస్తే ప్రపంచ చాంపియన్‌గా నిలిచే అతి పిన్న వయస్కుడిగా అతడు రికార్డులకెక్కుతాడు.
దేశం కోసం ఆడటం ప్రత్యేకం

‘గత కొన్ని రోజులుగా చాలా ఒత్తిడికి లోనయ్యా. కానీ నా ఆఖరి గేమ్‌ పూర్తికాకముందే చాలా ప్రశాంతంగా ఉంది. నేను గేమ్‌ ఆడుతున్నా నా దృష్టి అంతా ఆ గేమ్‌ (కరువానా-నెపొనియాచి) మీదే ఉంది. దేశం కోసం ఆడుతూ ఏదైనా సాధించడం చాలా చాలా ప్రత్యేకం. నా విజయానికి మద్దతుగా నిలిచినవారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఏడో రౌండ్‌లో ఓటమి తర్వాత విజయం నాలో కొత్త స్ఫూర్తిని నింపింది. ఓటమితో కాస్త నిరాశకు గురైనా తర్వాత మాత్రం పట్టుదలతో ఆడా. ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’.
– గుకేశ్‌
కొడుకు కల కోసం..

గుకేష్‌ విజయాల వెనుక అతడి తల్లిదండ్రుల త్యాగం ఎంతో ఉంది. కొడుకు కోసం అతడి తండ్రి, ఈఎన్‌టీ డాక్టర్‌ రజనీకాంత్‌ తన కెరీర్‌నే ఫణంగా పెట్టారు. గుకే్‌షను టోర్నీలు ఆడించడానికి అతడితో కలసి పర్యటించేవాడు. దీంతో మైక్రోబయాలజిస్ట్‌ అయిన తల్లి పద్మ ఇంటి బాధ్యతలు చూసుకొనేది. నాలుగో తరగతి తర్వాత స్కూల్‌కు వెళ్లడం ఆపేసిన గుకేష్‌.. పూర్తిగా చెస్‌ సాధనపైనే దృష్టి సారించాడు. తన కొడుకు కల నెరవేర్చడానికి విరాళాలు కూడా సేకరించేవారు. అరకొర డబ్బుతోనే ఎన్నోసార్లు గుకే్‌షను విదేశీ టోర్నీలకు తీసుకెళ్లారు.