Search for:
  • Home/
  • Breaking/
  • ప్రొ కబడ్డీ ‘ప్లే ఆఫ్స్‌’కు రంగం సిద్ధం

ప్రొ కబడ్డీ ‘ప్లే ఆఫ్స్‌’కు రంగం సిద్ధం

 - రేపటినుంచి హైదరాబాద్‌లో మ్యాచ్‌లు

పదో సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) కీలక దశ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ వేదికవుతోంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో సోమ, బుధ, శుక్రవారాల్లో ‘ప్లే ఆఫ్స్‌’ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా శనివారం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లీగ్‌ చైర్మన్‌ అనుపమ్‌ గోస్వామి టోర్నీ విశేషాలను వెల్లడించారు.

గత తొమ్మిదో సీజన్లతో పోలిస్తే ఈ సారి టోర్నీ ఇంకా ఎక్కువ సంఖ్యలో అభిమానులకు చేరువైందని… 12 ఫ్రాంచైజీలకు చెందిన నగరాలు అన్నింటిలో మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన అన్నారు. గ్రూప్‌ దశలో టాప్‌–2లో నిలిచిన పుణేరీ పల్టన్, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.

సెమీస్‌లో తలపడే ఇతర రెండు జట్లను ఖరారు చేసేందుకు రెండు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో ఢిల్లీని పటా్న, గుజరాత్‌ను హర్యానా ఢీకొంటాయి. ఈ నెల 26న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు, 28న సెమీఫైనల్స్, మార్చి 1న ఫైనల్‌ నిర్వహిస్తారు. హైదరాబాద్‌ నగర అభిమానులు ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు రూ. 250 – రూ. 3000 మధ్య ‘బుక్‌మైషో’లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.