Search for:

అశ్విని–తనీషా సంచలనం

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) జోడీ సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంక్‌ ద్వయం అశ్విని–తనీషా 21–19, 13–21, 21–15తో ప్రపంచ 9వ ర్యాంక్‌ జంట వకాన నాగహార–మాయు మత్సుమోటో (జపాన్‌)ను బోల్తా కొట్టించింది.

ఈ గెలుపుతో సూపర్‌–1000 స్థాయి టోర్నీలో అశ్విని–తనీషా ద్వయం తొలిసారి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంక్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ 21–11, 21–18తో లుకాస్‌ కోర్వి–రొనన్‌ లాబర్‌ (ఫ్రాన్స్‌)లపై గెలిచారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్‌ కథ ముగిసింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగాడు. ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 13–21, 17–21తో ఓడిపోయాడు.